50 ఏళ్ల తర్వాత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమా? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ హిమానీ, రేడియేషనల్ ఆంకాలజిస్ట్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
56 ఏళ్ల రామయ్యకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులూ లేవు. కానీ ఆయనకు పొగతాగే అలవాటు ఉంది. బరువు కూడా కొంచెం ఎక్కువే.
"నేను బాగానే ఉన్నా" అనుకుంటూ ఎన్నో సంవత్సరాలుగా ఆయన ఎలాంటి పరీక్షలూ చేయించుకోలేదు.
ఇప్పుడు రొటీన్ చెకప్ చేయించుకున్నారు. అందులో హైబీపీ, హెచ్బీ1ఏసీ ప్రీడయాబెటిస్ స్థాయిలో ఉండడంతోపాటు ఎల్డీఎల్ ఎక్కువగా ఉన్నట్టు తేలింది.
ఆయనకు స్మోకింగ్ సెస్సేషన్, డైట్, వ్యాయామం, కార్డియోవాస్కులర్ రిస్క్ ఆధారంగా చికిత్స ప్రారంభించారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి.
స్క్రీనింగ్ అనేది వ్యాధి ఉందని చెప్పడానికి మాత్రమే కాదు... వ్యాధి వచ్చే ప్రమాదాన్ని ముందే తెలుసుకోవడానికి కూడా అవసరం.

"నాకు ఏ సమస్యా లేదు.. పరీక్షలు ఎందుకు?" అని రామయ్య లానే 50 ఏళ్లు దాటిన చాలామంది చెబుతారు. కానీ వైద్యపరంగా చూస్తే ఈ వయస్సు నుంచే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.
ఎందుకంటే... హైబీపీ, మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, కొన్ని క్యాన్సర్లు, ఎముకల బలహీనత వంటి అనేక సమస్యలు ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు చూపకపోవచ్చు.
కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. 50 ఏళ్లు పైబడ్డాక సకాలంలో ఆరోగ్య పరీక్షలకు తప్పక ప్రాధాన్యం ఇవ్వాలి.

ఫొటో సోర్స్, Getty Images
50 ఏళ్లు దాటాక ప్రత్యేక శ్రద్ధ ఎందుకు?
వయసు పెరుగుతున్న కొద్దీ మన శరీరంలో సహజంగానే కొన్ని మార్పులు మొదలవుతాయి.
రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గడంతో పాటు, రక్తనాళాలు, ఎముకలు, కండరాలు, కంటి చూపు, వినికిడి వంటి విషయాల్లో కూడా మార్పులు చోటుచేసుకుంటాయి.
అందుకే 50 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, అవసరమైన పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం చాలా ముఖ్యం.
వయసుతో పాటు కొన్ని జీవనశైలి అలవాట్లు, కుటుంబ ఆరోగ్య చరిత్ర కూడా వ్యాధుల ప్రమాదాన్ని పెంచవచ్చు.
- శారీరక శ్రమ తగ్గిపోవడం
- అధిక బరువు
- పొగాకు వాడకం
- మద్యం సేవించడం
- ఉప్పు, చక్కెర, కొవ్వు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం
- తగినంత నిద్ర లేకపోవడం
- కుటుంబంలో గుండెజబ్బులు, మధుమేహం లేదా క్యాన్సర్ చరిత్ర ఉండటం
ఇలాంటివి వయసు పెరిగేకొద్దీ ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే వీటిని వీలైనంత వరకు నియంత్రించుకోవడం, క్రమం తప్పకుండా ఆరోగ్యాన్ని పర్యవేక్షించుకోవడం ముఖ్యం.

ఫొటో సోర్స్, Getty Images
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నేతృత్వంలో నిర్వహించిన ఐసీఎంఆర్-ఐఎన్డీఐఏబీ అధ్యయనం ప్రకారం, భారత్లో జీవనశైలి ఆధారిత మెటబాలిక్ వ్యాధుల తీవ్రత ఆందోళనకర స్థాయికి చేరుకుంది.
భారత జనాభాలో అధిక రక్తపోటు కేసులు 35.5%, మధుమేహం 11.4%, సాధారణ ఊబకాయం 28.6%గా నమోదు కాగా, భారత్లో ప్రతి ముగ్గురిలో ఒకరు అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారని ఈ నివేదికలో వెల్లడైంది.
పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా గ్రామీణ జనాభాలోనూ వేగంగా విస్తరిస్తున్న ఈ పరిస్థితులు, గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక సమస్యల ప్రమాదాన్ని పెంచుతూ ప్రజారోగ్యానికి పెను సవాలుగా మారుతున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



























