You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇంట్లో ఉన్నా వడదెబ్బ తగులుతుందా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 10 ప్రశ్నలు -జవాబులు
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.
ఈ తీవ్ర ఎండలతో వడదెబ్బ, డీహైడ్రేషన్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
వడదెబ్బ కేవలం బయట తిరిగేవారికే కాదు...ఇంట్లో ఉన్నవారికీ తగిలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బీపీ, షుగర్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో విశాఖపట్నానికి చెందిన జనరల్ ఫిజిషియన్ డాక్టర్ టి. స్రవంతితో బీబీసి మాట్లాడారు. వడదెబ్బ తగలకుండా ఏం చేయాలి? ఇంత తీవ్రమైన ఎండల్లో మన రోజువారి జీవితంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో ఆమె వివరించారు.
డాక్టర్ టి. స్రవంతి: అత్యధిక ఉష్ణోగ్రతల సమయంలో మన శరీరంలో థర్మో రెగ్యులేటరీ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. థర్మో రెగ్యులేటరీ సిస్టమ్ అంటే...మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ.
బయట ఎంత ఎండ ఉన్నా మన శరీరం లోపల వేడిని తగ్గించుకోవడానికి చెమట రూపంలో చల్లబరిచే ప్రయత్నం చేయటం.
ఇందులో భాగంగానే వేసవిలో శరీరాన్ని చల్లబరచడానికి చెమట ఎక్కువగా పడుతుంది. ఆ చెమటలో నీటితోపాటు సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు కూడా బయటకు వెళ్లిపోతాయి.
దీంతో బలహీనంగా అనిపించడం బీపీ డౌన్ కావడం లాంటివి జరుగుతాయి. బీపీ మరీ తగ్గిపోతే కిడ్నీలు, మెదడు లాంటి అవయవాలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.
డాక్టర్ టి. స్రవంతి: ఎండలో తిరిగిన తర్వాత బాగా నీరసంగా అనిపించడం, తల తిరగడం, తీవ్రమైన బలహీనత, వాంతులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని హీట్ ఎఫెక్ట్గా భావించాలి.
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. వడదెబ్బ కొన్నిసార్లు అత్యవసర పరిస్థితికి దారి తీస్తుంది.
వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి సెలైన్ బాటిల్స్ పెట్టించడం, అవసరమైన వైద్యం అందించాల్సి ఉంటుంది. లేదంటే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది.
డాక్టర్ టి. స్రవంతి: వాంతులు ఆగకపోవడం, నీళ్లు కూడా తాగలేకపోవడం, స్పృహ కోల్పోవడం వంటి పరిస్థితులు వస్తే అది ఎమర్జెన్సీ.
వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి. అంత వరకు మెడ కింద, అండర్ ఆర్మ్స్, తొడల దగ్గర ఐస్ ముక్కలు పెట్టాలి. తడి గుడ్డలు ఉపయోగించి శరీరాన్ని చల్లబరచాలి.
డాక్టర్ టి. స్రవంతి: చాలామంది ఎండలో తిరిగితేనే వడదెబ్బ వస్తుందని అనుకుంటారు. కానీ ఇంట్లో ఉన్నవారికీ అధిక ఉష్ణోగ్రతలు వలన సన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పవర్ కట్ సమయంలో ఫ్యాన్, కూలర్, ఏసీ పని చేయవు.
అలాంటి సమయాల్లో ఉక్కపోత, వేడివల్ల పిల్లలు, వృద్ధులకు వడదెబ్బ తగిలే ప్రమాదం పెరుగుతుంది.
డాక్టర్ టి. స్రవంతి: దాహం వేసే వరకు ఆగకూడదు. ప్రతి 15 నుంచి 20 నిమిషాలకు కొద్దికొద్దిగా నీళ్లు తాగాలి.
అలా చేస్తే డీహైడ్రేషన్ను చాలా వరకు నివారించవచ్చు.
డాక్టర్ టి. స్రవంతి: షుగర్ ఉన్నవారిలో యూరిన్ ద్వారా నీరు ఎక్కువగా బయటకు వెళ్లిపోతుంది.
అదే సమయంలో చెమట ద్వారా కూడా నీరు కోల్పోతే డీహైడ్రేషన్ త్వరగా వస్తుంది.
బీపీ మందుల్లో కొన్ని శరీరంలోని నీటిని బయటకు పంపిస్తాయి.
అందుకే బీపీ, షుగర్ ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.
డాక్టర్ టి. స్రవంతి: కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్, మజ్జిగ, నిమ్మరసం వేసవిలో చాలా మంచివి. ఇవి శరీరంలో నీరు, లవణాల సమతౌల్యాన్ని కాపాడతాయి.
టీ, కాఫీ, ఆల్కహాల్ వంటి పానీయాలు డీహైడ్రేషన్ను మరింత పెంచుతాయి.
డాక్టర్ టి. స్రవంతి: పగటి సమయంలో తలుపులు, కిటికీలు ఎక్కువగా మూసి ఉంచడం మంచిది. కూలర్లు, ఫ్యాన్లు ఉపయోగించాలి.
ఎక్కువ వేడి ఉత్పత్తి చేసే యంత్రాలను ఆఫ్ చేయాలి. రాత్రిళ్లు కూడా వాతావరణం చల్లబడకపోతే శరీరానికి విశ్రాంతి దొరకదు.
డాక్టర్ టి. స్రవంతి: కాటన్ బట్టలు, లైట్ కలర్స్, వదులుగా ఉండే దుస్తులు వేసుకోవాలి. డార్క్ కలర్స్ ఎక్కువ వేడిని ఆకర్షిస్తాయి.
డాక్టర్ టి. స్రవంతి: కార్లు వంటి మూసివేసిన ప్రదేశాల్లో ఉష్ణోగ్రత చాలా వేగంగా పెరుగుతుంది.
పిల్లల్లో శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందదు.
అందుకే హీట్ స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ. కాబట్టి పిల్లలను కార్లో ఒంటరిగా వదిలేయకూడదు.
(ఈ ప్రశ్నలకు సమాధానాలిచ్చిన టి. స్రవంతి వైద్యురాలు. ఎండాకాలంలో వేడి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై అవగాహన కోసమే ఈ కథనం. నిర్దిష్టమైన ఆరోగ్య సమస్య ఏర్పడినప్పుడు వెంటనే డాక్టరును సంప్రదించండి )
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)